హైదరాబాద్ : రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ మొహర్రం శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులు జరుపుకునే మొహర్రం త్యాగాలకు ప్రతీకగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. నాటి కాలంలో ఇమామ్ హసన్, ఇమామ్ హుస్సేన్ సహా పలువురి త్యాగాలను స్మరించుకుంటూ మొహర్రం సాగుతుందన్నారు. త్యాగాలకు గుర్తుగా రాష్ట్రవ్యాప్తంగా హిందూ, ముస్లిం సోదరులు తరతరాలుగా మొహర్రం పండుగను నిర్వహిస్తున్నారని సీఎం గుర్తు చేశారు. పీర్ల పండుగ పేరుతో తెలంగాణలో హిందూ, ముస్లింల సాంస్కృతిక ఐక్యతకు చిహ్నంగా మొహర్రం నిలిచిందన్నారు. హిందువులు హసన్, హుస్సేన్లను ఆశన్న, ఊశన్నలనే పేర్లతో పీరీలను ఎత్తుకొని పాటలు పాడుకుంటూ, నాటి వారి త్యాగాలను పేరుపేరునా కీర్తిస్తూ, త్యాగానికి చిహ్నంగా నిప్పుల గుండాల పై నడుస్తారని సీఎం తెలిపారు. గంగా జమున తెహజీబ్కు ప్రతీకగా నిలిచి, దేశానికే ఆదర్శంగా లౌకికవాద స్ఫూర్తిని మొహర్రం నింపుతున్నదన్నారు.