– చోద్యం చూస్తున్న అధికారులు
– ప్రోత్సహిస్తున్న ప్రజాప్రతినిధి
నవతెలంగాణ-బోనకల్
మండల కేంద్రంలోని ఆర్ఓబి బ్రిడ్జి కింద స్థలాలను ఆక్రమించుకునేందుకు పాత కిరాయి వ్యాపారస్తులు పోటీలు పడుతున్నారు. పాత కిరాయి వ్యాపారస్తుడు తన డబ్బా కొట్టును తీసుకువచ్చి బ్రిడ్జి కింద గురువారం పెట్టడంతో పెద్ద దుమారం లేచింది. బోనకల్ గ్రామానికి చెందిన జూపల్లి వెంకటేశ్వర్లు మండల కేంద్రంలోని ఓ షాపుని కిరాయికి తీసుకొని షాపు నిర్వహించుకుంటున్నాడు. మరోవైపు ముష్టికుంట్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ప్రతిరోజు 500 రూపాయలు కూలి ఇస్తూ నాలుగు చక్రాల బండిపై పండ్ల వ్యాపారం చేయిస్తున్నాడు. దాదాపు రెండు నెలల నుంచి ఈ తతంగమంతా నడుస్తూ ఉంది. రెండు సంవత్సరాల క్రితం జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ ఆర్ఓబి బ్రిడ్జి కింద అక్రమ కట్టడాలను, కిరాయి షాపులను తొలగించి బ్రిడ్జి కింద ప్రజలకు ఉపయోగపడే విధంగా తయారు చేయించారు. కాని కొంతమంది కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు మరల ఆర్ఓబి బ్రిడ్జి కింద స్థలాలను ఆక్రమించే వారికి నేరుగా మద్దతు తెలుపుతున్నారు. బోనకల్లుకు చెందిన ఓ మండల ప్రజా ప్రతినిధి కిరాయిదారులను ప్రోత్సహిస్తూ ఆర్ఓబి స్థలాల ఆక్రమణలను యదేచ్చగా ప్రోత్సహిస్తున్నాడు. ఆర్ఓబి స్థలాలు ప్రస్తుతం ఎంతో సుందరవణంగా తయారై మండల ప్రజలందరికి ఉపయోగపడుతుండగా కొంతమంది స్వార్థపరులు, రాజకీయ నాయకులు మరల కిరాయిదారులను ప్రోత్సహిస్తున్నారు. ఓ వ్యక్తి అరటిపండ్లు పెట్టుకొని చిరు వ్యాపారం చేసుకుంటుండగా గతంలో ఆర్ఓబి స్థలం కిరాయిదారుడు షేక్ జానీ ఆ స్థలం నాదని ఓ డబ్బా కొట్టు తీసుకువచ్చి గురువారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సులు ఆగే స్థలం వద్ద పాత కిరాయి స్థలంలో వేశాడు. గత కొన్ని రోజులుగా ఓ వ్యక్తి అక్కడ కేవలం అరటి పండ్లు పెట్టుకొని వెళ్లిపోతున్నాడు. షేక్ జానీ అతని భార్య, ఇద్దరు కుమార్తెలు వచ్చి ఆ యువకుడు పై దాడికి యత్నించారు. దీంతో పెద్ద ఎత్తున వివాదం జరిగింది. పోలీసుల రంగ ప్రవేశం చేశారు. షేక్ జానీ కుటుంబం పోలీసులను కూడా లెక్కచేయకుండ ఆ యువకుడుపై చెలరేగారు. దీనికంతటికీ కారణం జూపల్లి వెంకటేశ్వర్లు ప్రతిరోజు నాలుగు చక్రాల బండి మీద పండ్ల వ్యాపారం కోసం ఓ వ్యక్తికి రోజుకు 500 రూపాయలు ఇచ్చి కిరాయి వ్యాపారం చేయించటమేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ కిరాయి వ్యాపారికి ఓ మండల ప్రజా ప్రతినిధి బీఆర్ఎస్, కాంగ్రెస్లకు చెందిన నాయకులు మద్దతుగా నిలవటమే. మండల అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. స్వయంగా ఓ మండల ప్రజా ప్రతినిధి కిరాయి దారుల ఆక్రమణలను ప్రోత్సహిస్తూ ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారటం విశేషం.